భాద్రపద మాసంలో వినాయక చవితికి ఒకరోజు ముందుగా వచ్చే శుద్ధ తదియ నాడు తదియ గౌరీ నోము చేసుకుంటారు. ఈ వ్రతం రోజు ముందుగా ముత్తయిదువులు తల స్నానం చేసి, పూజగదిలో ఒక మూలాన పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు పెట్టి దాని మీద ఒక విస్తరి ఆకు పెట్టి విస్తరాకు మీద ఇసుక పోసి దాని మీద ఒక వెండి కానీ రాగి చెంబు కానీ పెట్టి, ఆ చెంబులో బియ్యం పోసి అందులో గన్నేరు కొమ్మ పెట్టి ఆ చెంబుకు ఐదు పోగుల దారం దానికి ఉత్తరేణి లేదా తమలపాకుతో కానీ తోరం కట్టి చెంబుకు గంధంతో కుంకుమ బొట్లు పెట్టి ఆ చెంబు ముందట ఒకటి వెండిది కానీ రాగి కానీ లేక ఇతడి పళ్లెం కానీ పెట్టి ఆ పళ్లెంలో బియ్యం పోసి దాని మీద తమలపాకు రెండు పెట్టి పసుపుతో గౌరీ దేవిని చేసి పెట్టి, వస్త్రం, జంధ్యం,రెండు వక్కలు, ఒకటి నాణెము పెట్టి ఆ పీట మీద రెండు దీపపు కుందులు పెట్టి గౌరీ దేవికి పండ్లు ,పువ్వులు ,తాంబూలం ఇలా అన్ని సమకూర్చిన తరువాత బియ్యం పిండితో కుడుములు చేసి తరువాత దారంతో 16 పోగులు చేసి 16 ముడులు వేసి 16 ఉత్తరేణి ఆకులు కంకణంలా కట్టవలెను. ఇలా 16 పోగుల దారంతో రెండు కంకణాలుగా తయారు చేసుకోవాలి. ఐదు పోగుల దారం రెండు తయారు చేసుకోవాలి. ఐదు పోగుల దారంకు ఐదు ముడులు వేయాలి. ఐదు ఉత్తరేణి ఆకులు కట్టాలి. తరువాత విస్తరి ఆకులతో డొప్పలు అనగా గిన్నెలు మాదిరిగా కుట్టవలెను. ఇవి రెండు డొప్పలు తయారు చేసుకోవాలి. ఇందులో ఒక్కొక డొప్పకు 16 కుడుములు చొప్పున పెట్టి వాటి మీద కొత్త చింతకాయ పచ్చడి కొంచం ముద్ద పప్పు కొంచం నెయ్యి బెల్లం పదహారు పోగుల దారం ఒకటి, ఐదు పోగుల దారం ఒకటి పెట్టి దీపములు వెలిగించి, గౌరీ అష్టోత్తర నామాలు చదువుకుంటూ పళ్లెంలో పెట్టిన గౌరీ దేవికి పసుపు కుంకుమ అక్షింతలు వేసి పువ్వులు పెట్టుకుంటూ పూజచేసుకోవాలి. అలాగే కుడుములు మీద గౌరీ దేవికి కూడా పసుపు, కుంకుమ ,అక్షింతలు పెట్టి పూజ చేసుకొని నోము నోచుకోవాలి. తరువాత దూపం వెలిగించి నైవేద్యం పెట్టి ఆరతి ఇచ్చి పూజ ముగించవలెను. ఇలా నోము నోచుకోని తరువాత ఏ డొప్పలో కుడుములు మీద గౌరీ దేవిని పెట్టిన దానిలోనుండి పదహారు పోగుల దారం ఐదు పోగుల దారం తీసి భర్త చేత పదహారు పోగుల దారం చేతికి ఐదు పోగుల దారం మెడకు కట్టించుకోవాలి. తరువాత ఒక ముతైదువుకు రెండవ డొప్పలోని కుడుములతో పాటు రెండు రవిక బట్టలు కొద్దిగా పసుపు ,కుంకుమ ,పువ్వులు ,వొక్కలు ,ఆకులు రెండు ,పండు తాంబూలంతో సహా వాయినం ఇవ్వాలి. వాయినం ఇచ్చిన తరువాత 16 పోగుల దారం చేతికి ఐదు పోగుల దారం మెడకు ముతైదువుకు కట్టాలి. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి మొదటి సారి 16 డొప్పలు చేసి ఒక్కొక డొప్పలో 16 కుడుములు చొప్పున పెట్టి 16 పోగుల దారం డొప్పకి ఒకటి చొప్పున ఐదు పోగుల దారం ఒకటి చొప్పున పెట్టి గౌరీ దేవి పెట్టిన డొప్ప మనము పక్కన పెట్టుకొని మిగితా 15 డొప్పలు 15 మంది ముత్తయిదువులకు వాయినం ఇవ్వాలి. మొదటి సంవత్సరం 16 డొప్పలు చొప్పున ప్రతి సంవత్సరం రెండు డొప్పలు చొప్పున మాత్రమే నోము నోచుకోవాలి.
Comments
Post a Comment